
eenadu.net · Feb 20, 2026 · Collected from GDELT
Published: 20260220T001500Z
సీఎం, మంత్రులకు అధిష్ఠానం అభినందన కరీంనగర్ ఫలితం గురించి మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో 10వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట ఇన్ఛార్జులను మార్చాలని సూచన సింగరేణి టెండర్ల వ్యవహారంపై ఆరా దిల్లీలో ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్లతో రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఇతర నేతలు ఈనాడు, దిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, పంచాయతీ, మున్సిపల్ పోరులో పార్టీ మంచి ఫలితాలు సాధించడం పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తంచేశారు. సీఎం, మంత్రులు, పీసీసీ సహా కష్టపడి పనిచేసిన వారందర్నీ గురువారం అభినందించారు. గత రెండేళ్ల అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడిని దిల్లీకి పిలిపించిన పార్టీ అగ్రనేతలు దాదాపు రెండు గంటలు చర్చించారు. ఇప్పటివరకు అన్నీ సానుకూలంగా సాగాయని, ఇకముందు కూడా కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. తొలుత మంత్రులతో సమావేశమై చర్చించిన అధిష్ఠానం పెద్దలు ఆ తర్వాత ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలతో విడివిడిగా సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన సింగరేణి టెండర్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం. అందరితో మాట్లాడిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలు.. సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణ గురించి సీతక్క, ధాన్యం కొనుగోలుపై ఉత్తమ్కుమార్రెడ్డి..భూభారతి, పేదలకు ఇళ్ల నిర్మాణంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పామాయిల్ తోటల పెంపకంపై తుమ్మల నాగేశ్వరరావు, గిగ్ వర్కర్ల విధానంపై వివేక్ తదితరులు వివరించినట్లు తెలిసింది. గిగ్ వర్కర్ల చట్టం త్వరగా తీసుకురావాలి అని రాహుల్గాంధీ సూచించినట్లు సమాచారం. మంత్రులు చెబుతున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని ఈ పథకాల పటిష్ఠ అమలుకు తీసుకొంటున్న చర్యల గురించి మాట్లాడినట్లు తెలిసింది. సమ్మక్క-సారలమ్మ చరిత్ర..ప్రభుత్వం కొత్తగా నిర్మాణాలు చేపట్టి జాతరను విజయవంతంగా నిర్వహించిన తీరు గురించి తెలుసుకొన్న రాహుల్గాంధీ... సమ్మక్క-సారలమ్మలపై జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా ఓ చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతరను విజయవంతంగా నిర్వహించడంపై ఖర్గే అభినందిస్తూ.. తమనూ పిలిచి ఉంటే వచ్చేవాళ్లం కదా? అని నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాహుల్తో సీఎం రేవంత్రెడ్డి కరచాలనం మళ్లీ గెలుస్తాం: మహేశ్కుమార్గౌడ్ సమావేశానంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ అంతర్గతంగా జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. ‘‘జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలు, గ్రామపంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలను సమీక్షించారు. తాజా ఎన్నికల ఫలితాల పట్ల పార్టీ అగ్రనేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 80% మంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ఆస్వాదిస్తున్నారు... మున్సిపల్ ఎన్నికల ఫలితాలు దాన్ని ప్రతిబింబించాయి అని ఖర్గే చెప్పారు’’ అని మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. మార్చి రెండోవారానికల్లా నామినేటెడ్ పదవులు, మిగిలిన పీసీసీ కార్యవర్గ పోస్టులు, జిల్లా, బ్లాక్ కమిటీలు భర్తీచేస్తామని విలేకర్ల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాజగోపాల్రెడ్డితో అధిష్ఠానం మాట్లాడుతుంది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవల పార్టీ, సీఎంపై చేసిన వ్యాఖ్యల గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఆయనపై కూడా చర్చ జరిగింది. త్వరలో అధిష్ఠానం పిలిచి మాట్లాడుతుంది’’ అని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నిక అంశంపైనా మాట్లాడారని, రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రిని, నన్ను పిలిచి మరోమారు మాట్లాడతామని అధిష్ఠానం పెద్దలు చెప్పినట్లు పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. మంత్రివర్గంలో మిగిలిన ఖాళీల భర్తీ అంశం చర్చకు రాలేదన్నారు. కాంగ్రెస్పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్న కేటీఆర్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేసీఆర్లా తాము ప్రజలను వదిలేసిపోమన్నారు. 6 హామీల్లో అత్యధికం అమలు చేస్తున్నామని, ఇంకా మూడేళ్ల సమయం ఉన్నందున ఆలోపు అన్నీ అమలుచేసి శభాష్ అనిపించుకొని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఫాంహౌస్ రాజకీయాలు చేయడంలేదు: మంత్రి పొన్నం రాష్ట్ర మంత్రివర్గమంతా దిల్లీకి రావడంపై భారాస చేసిన ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘‘ఫాంహౌస్ నుంచి పరిపాలన చేస్తే కాని తప్పు.. జాతీయపార్టీ నాయకత్వాన్ని కలిస్తే ఎలా తప్పవుతుంది? మేం కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందువల్ల ఏఐసీసీ అధ్యక్షుడికి పిలిచి మాట్లాడే హక్కుంటుంది. మమ్మల్ని తప్పుపడుతున్న భారాస దిల్లీలో పార్టీ కార్యాలయం కోసం ఎందుకు స్థలం తీసుకొంది? ప్రాంతీయ పార్టీకి ఇక్కడేం పని ఉందో సమాధానం చెప్పాలి’’ అని ప్రశ్నించారు. సమ్మిళిత తెలంగాణ కోసం నిరంతర కృషి: ఖర్గే ఖర్గేకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి దామోదర్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడానికి కారణాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వివరించారు. భారాస, భాజపాలు ఎలా బలహీనపడ్డాయో చెప్పారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడంవల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. దాని పట్ల ఖర్గే, రాహుల్గాంధీలు సంతృప్తి వ్యక్తంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 10వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన చోట్ల ఇన్ఛార్జులను మార్చాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు సమాచారం. కరీంనగర్ కార్పొరేషన్ ఫలితం గురించి కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదని రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రశ్నించినట్లు సమాచారం. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబులు వివరణ ఇచ్చినా సంతృప్తి చెందలేదని తెలిసింది. ఇంకా సమావేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం, సమీకృత పాఠశాలల గురించి చర్చ జరిగింది. ‘‘తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం తెలంగాణ విజన్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు రాష్ట్ర నాయకులు, మంత్రులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించాం. ప్రజలందరి ఆశయాలు నెరవేర్చడానికి, సమ్మిళిత తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం కృషిచేస్తూనే ఉంటాం’’ అని సమావేశానంతరం ఖర్గే ఎక్స్లో పేర్కొన్నారు.